సిద్దిపేట,అర్జున్ సమాచారం:
మార్కూక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ మోసం కేసును గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రవి రాజు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.కేసు వివరాల్లోకి వెళితే, పల్లె సాయికిరణ్, తండ్రి శ్రీశైలం, నివాసం బీరంగూడ, అమీన్పూర్, లక్ష్మీ డెయిరీ ఫార్మ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ,గేదెలు,బర్రెలు అమ్మకానికి ఉన్నట్లు వీడియోలు అప్లోడ్ చేసేవాడు. వీడియోలలో చూపించిన ఫోన్ నంబర్కు సంప్రదించిన అమాయక ప్రజలను నమ్మించి, ముందుగా అడ్వాన్స్ చెల్లించాలని చెప్పి వారి నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడుతున్నాడు.
ఈ క్రమంలో, మార్కూక్ గ్రామానికి చెందిన సాయిరెడ్డి, శంకర్ రెడ్డి యూట్యూబ్లో వీడియోలు చూసి నిందితుడిని సంప్రదించి 10 బర్రెలు కావాలని కోరగా, వాటి ధర రూ.15 లక్షలు అని చెప్పి సుమారు రూ.2,50,000 అడ్వాన్స్గా ఆన్లైన్ ద్వారా తీసుకున్నాడు. అనంతరం బర్రెలను ఎప్పుడు పంపిస్తారని బాధితుడు పలుమార్లు సంప్రదించినప్పటికీ నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు.
బాధితుడు సైబర్ ఫిర్యాదు చేయగా, మార్కూక్ పోలీస్ స్టేషన్ సైబర్ క్రైం కేసు నమోదు చేయబడింది.
గజ్వేల్ రూరల్ సీఐ డి. రవి రాజు ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి గజ్వేల్ న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
దర్యాప్తులో నిందితుడు ఇదే తరహాలో మరికొందరిని కూడా లక్షల వరకు మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నాగర్కర్నూల్ మరియు వికారబాద్ జిల్లాలో కూడా ఇదే తరహాలో కేసులు నమోదైనట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా గజ్వేల్ రూరల్ సీఐ డి. రవి రాజు ప్రజలకు సూచిస్తూ, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని, వస్తువులను కొనుగోలు చేసే ముందు విక్రేత వివరాలు పూర్తిగా ధృవీకరించుకోవాలని,ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు ముందస్తుగా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపవద్దని సూచించారు.
అదేవిధంగా, ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
==========================